Tuesday, July 17, 2012


బయటపడుతున్న రాజగురువు అసలు రంగు  
(సాక్షి నుంచి )


రాజగురువు అసలు రంగు బయటపడుతోంది. ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీ అల్లిబిల్లి కంపెనీలతో కలిసి ఏకంగా వేలాది కోట్ల రూపాయల మేరకు పన్నుల ఎగవేతకు పాల్పడ్డ వైనంపై నెమ్మదిగా తెర తొలగుతోంది. ఉషోదయాలోకి రిలయన్స్‌ నిధుల వరదపై ఆదాయపు పన్న శాఖ కొరడా ఝళిపించింది.
ఊహలకందని రీతిలో గొట్టం కంపెనీలు సృష్టించి.. అక్రమంగా వేలకోట్ల రూపాయల్ని తెచ్చుకున్న రామోజీ తీరుపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు మొదలుపెట్టింది. 35 రోజుల వ్యవధిలో పుట్టిన పదుల కొద్దీ గొట్టం కంపెనీల ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లోకి నిధులు ప్రవహించిన తీరును తప్పుబడుతూ... ఈ నిధుల ప్రవాహపు తీరును సమీక్షిస్తున్నామంటూ రామోజీరావుకు తాజాగా నోటీసులు జారీ చేసింది. రామోజీరావు, ఆయన గ్రూపు కంపెనీలు కలిసి రూ.3,550 కోట్ల మేర ఆదాయపు పన్నును ఎగవేశాయని, కేజీ బేసిన్ గ్యాస్‌ను రిలయన్స్‌కు కట్టబెట్టిన చంద్రబాబు.. అందుకోసం ఆ సంస్థ నుంచి తాను తీసుకున్న ముడుపులనే గురుదక్షిణ రూపంలో రామోజీరావుకు అదే రిలయన్స్ ద్వారా తిరిగి అందజేశారంటూ ఆడిటర్ .విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌పై స్పందిస్తూ ఐటీ శాఖ ఈ చర్యలు తీసుకుంది. అంతేకాదు.. పాత సినిమాలు, అప్పటికే ప్రసారమై, కాలం చెల్లిపోయిన సీరియళ్లను ఉషాకిరణ్ టెలివిజన్, ఉషాకిరణ్ మూవీస్ ఒకదానికొకటి విక్రయించుకునట్టుగా చూపించి, దానికి ఆకాశాన్నంటే రీతిలో ఏకంగా రూ.787 కోట్లు విలువ కట్టిన తీరుపై కూడా ఐటీ శాఖ దర్యాప్తు మొదలుపెట్టింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్లకు సంబంధించి రామోజీరావు అటు సుప్రీంకోర్టు వద్ద, ఇటు రిజర్వు బ్యాంకు వద్ద పేర్కొన్న మొత్తాల్లో దాదాపు రూ.150 కోట్ల మేరకు తేడా ఉంది. ఈ అంశాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐటీ శాఖ తాజాగా స్పష్టం చేసింది. నిజానికి ఈ అక్రమాలపై విజయసాయిరెడ్డి 2012 ఫిబ్రవరిలోనే పిటిషన్ వేశారు. అనంతరం దానిపై తీసుకున్న చర్యలను తెలియజేయాలంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు దాఖలు చేశారు. వీటన్నిటినీ జతచేస్తూ.. సోమవారం ఆయన నేరుగా ఐటీ కార్యాలయానికి వెళ్లి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మరిన్ని అంశాలను ఐటీ శాఖ దష్టికి ఆయన తీసుకెళ్లారు. 193 పేజీల డాక్యుమెంట్లను కూడా సమర్పించారు.
పనికిమాలిన ఆస్తుల్ని చూపించి ఉషోదయా సంస్థ తన విలును రూ.6,600 కోట్లుగా తనే అంచనా వేసుకుంది. దాంతో కుమ్మక్కయిన రిలయన్స్ గ్రూపు  కేవలం 35 రోజుల్లో 6 బ్రీఫ్‌కేసు కంపెనీల్ని సష్టించి, వాటిద్వారా రూ.2,600 కోట్లను రామోజీ కంపెనీల్లోకి పంపించింది. ఇలా 39 శాతం వాటాను కొనుక్కుంది. ఒకో షేరుకు ఏకంగా రూ.5,28,630 చెల్లించి బ్రీఫ్‌కేసు కంపెనీలు  ఉషోదయాలో పెట్టుబడి పెట్టాయి. ఇంత భారీ నిధులు తమకు ఏ సంస్థ నుంచి వచ్చాయన్నది తమ ఆస్తిఅప్పుల పట్టీల్లో ఈ కంపెనీలు ఎక్కడా చెప్పలేదు. నిజానికి ఈ డబ్బులు రిలయన్స్‌వే అయి ఉంటే అది తొలుత తన బోర్డు అనుమతి తీసుకోవాలి. సెబీకి చెప్పాలి. స్టాక్ ఎక్స్ఛేంజీలకూ సమాచారమివ్వాలి. అలా చేసినపుడు ఈ బ్రీఫ్‌కేసు కంపెనీల అవసరమే ఉండదు... అని విజయసాయిరెడ్డి వివరించారు. ఉషోదయా సంస్థ తన టీవీ చానెళ్ల విలువను రూ.4,200 కోట్లుగా చూపించిందని చెబుతూ...ఈ అక్రమాన్ని కూడా సాయిరెడ్డి ఆధారాలతో సహా వివరించారు.
2008లో రామోజీరావు మారిషస్‌కు చెందిన బ్లాక్‌స్టోన్ క్యాపిటల్ పార్ట్‌నర్స్‌కు తన సంస్థలో 13 శాతం వాటా రూ.590 కోట్లకు అమ్ముతానని ప్రతిపాదించారు. దీనికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి  2008 ఫిబ్రవరి 13న ఆమోదం తెలిపింది. ఈ లెక్కన చూస్తే ఉషోదయా మొత్తం విలువ రూ.4,538 కోట్లు. కానీ రిలయన్స్-కంపానీలకు వచ్చేసరికి మాత్రం దీని విలువ ఏకంగా రూ.6,600 కోట్లకు పెరిగిపోయింది. బ్లాక్ మనీని మళ్లించడానికే ఇలా చేశారు తప్ప వేరొకదానికి కాదుఅంటూ ఇలాంటి వ్యవహారాలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని కూడా సాయిరెడ్డి ప్రస్తావించారు. ఎన్టీఆర్‌ను గద్దెదించటంలో చంద్రబాబు నాయుడికి రామోజీరావు సహకరించిన వైనాన్ని కూడా ఆయన సవివరంగా తెలియజేశారు. తర్వాత మద్య నిషేధాన్ని ఎత్తివేసే సమయంలో కూడా చంద్రబాబును రామోజీ తన ఈనాడుద్వారా పూర్తిస్థాయిలో ఎలా వెనకేసుకొచ్చిందీ వివరించారు. కష్ణా-గోదావరి బేసిన్లో గ్యాస్ నిక్షేపాల కోసం పోటీపడకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కావాల్సినంత మేలు చేశారని, అందుకు ప్రతిఫలంగానే రిలయన్స్ సంస్థ రూ.2,600 కోట్లు రామోజీ సంస్థల్లోకి పంపించిందని సాయిరెడ్డి పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న రామోజీకి చంద్రబాబు సమర్పించుకున్న గురుదక్షిణగా దీన్ని అభివర్ణించారాయన.